Monday, February 18, 2019

వైసీపీలోకి అమలాపురం టీడీపీ ఎంపీ.. రెండ్రోజుల్లో జగన్‌తో భేటీ?

ఎన్నికల వేళ ఏపీలో అధికార పార్టీ టీడీపీకి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు పార్టీని వీడి వైకాపాలో చేరుతుండటం టీడీపీలో కలవరం రేపుతోంది. ఈ కోవలోనే మరోవార్త ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. కోనసీమ ప్రధాన కేంద్రమైన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు(టీడీపీ) ప్రతిపక్ష పార్టీ వైకాపా వైపు చూస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాను పార్టీ మారడం లేదని, చంద్రబాబు నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని ఇటీవలే ఆయన వ్యాఖ్యానించారు.

అయితే కొద్దికాలంగా వైకాపా వర్గాలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే యోచన లేదని పైకి చెబుతున్నా రవీంద్రబాబు మాత్రం వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన నేడో, రేపో వైకాపా అధ్యక్షుడు జగన్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జన్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అధికార పార్టీని వీడి వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే అమలాపురం ఎంపీ కూడా ప్రతిపక్ష పార్టీలోకి జంప్ కానున్నారన్న వార్త టీడీపీలో కలకలం రేపుతోంది. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన పందుల రవీంద్రబాబు తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో అమలాపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

No comments:

Post a Comment